రెండు లారీలు దగ్ధం..గద్వాల జిల్లా వేముల స్టేజీ వద్ద ఘటన

రెండు లారీలు దగ్ధం..గద్వాల జిల్లా వేముల స్టేజీ వద్ద ఘటన

అలంపూర్/ఇటిక్యాల, వెలుగు : ఓ లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు లేచి రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ వేముల సమీపంలో హైవేపై పక్కన ఆగి ఉంది.

తాండూర్‌‌‌‌ నుంచి నంద్యాలకు బండల లోడుతో వెళ్తున్న మరో లారీ వేముల స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు లారీలకు అంటుకున్నాయి. ప్రమాదంలో బండల లోడ్‌‌‌‌తో ఉన్న లారీ డ్రైవర్ రాజశేఖర్‌‌‌‌, క్లీనర్‌‌‌‌ రామకృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని హైవే అంబులెన్స్‌‌‌‌లో కర్నూల్‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న ఫైర్‌‌‌‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. హైవేపై సుమారు రెండు గంటల పాటు మంటలు రేగడంతో ట్రాఫిక్‌‌‌‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలంపూర్ సీఐ రవిబాబు, కోదండాపురం ఎస్సై మురళి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.